విద్యాశాఖ మంత్రి బొత్సకు రెండు మార్కులే!

Vitapu-Balasubrahmanyam_Botsa-Satyanarayana-YSRCPమంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయాలు చేయడంలో దిట్ట కావచ్చు కానీ తన విద్యాశాఖకు సంబందించిన విషయాలపై మాట్లాడేందుకు ఎప్పుడూ తడబడుతుంటారని అందరికీ తెలుసు. శాసనమండలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం డీఎస్సీలు, ఉపాధ్యాయుల భర్తీ గురించి మంత్రి బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు.

ADVERTISEMENT

ఇంతకీ ఆయనేదో చాలా సంక్లిష్టమైన ప్రశ్న వేయలేదు. “2019 నుంచి నేటి వరకు మీ ప్రభుత్వం ఎన్ని డీఎస్సీలు నిర్వహించింది?వాటితో ఎంతమంది ఉపాధ్యాయులను భర్తీ చేసింది? ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి? వాటిని భర్తీ చేసేందుకు మీ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకొంటోంది? అని ప్రశ్నించారు.

ఇది చాలా సింపుల్ ప్రశ్న అని అర్దమవుతూనే ఉంది. అయితే మంత్రి బొత్స సత్యనారాయణ దానికి సూటిగా సమాధానం చెప్పకుండా ముక్కు ఏది అంటే చుట్టూ తిప్పి చూపించిన్నట్లు సమాధానం చెప్పారు.

మేము అధికారంలోకి రాగానే 2019లో తొలి డీఎస్సీ నిర్వహించి 14,219 పోస్టులు భర్తీ చేశాము. అంతకు ముందు అంటే 1998, 2018లో నిర్వహించిన డీఎస్సీలలో అర్హత సాధించినవారికి కూడా పోస్టింగ్‌లు ఇస్తున్నాము. ఇంకా 771 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. పదవీ విరమణ వయసు రెండేళ్ళు పెంచడం వలన కొత్తగా ఖాళీలు ఏర్పడలేదు. మంజూరు చేసిన పోస్టులను రద్దు చేయలేదు,” అని సమాధానం ఇచ్చారు.

మంత్రి బొత్స జవాబుపై వెంటనే ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం స్పందిస్తూ, “నేను అడిగిన ప్రశ్న ఏమిటి? మీరు చెప్పిన సమాధానం ఏమిటి? నా విద్యార్ధి ఎవరైనా ఈవిదంగా సమాధానం చెపితే 10కి 2 మార్కులు కూడా వేయను. ఈ నాలుగేళ్ళలో ఎన్నిసార్లు డీఎస్సీ నిర్వహించారని అడిగితే, ఎప్పుడో జరిగిన డీఎస్సీల గురించి ఎందుకు చెపుతున్నారు?

ఒకవేళ డీఎస్సీలు నిర్వహిస్తే ఆ సంఖ్య చెప్పాలి లేకపోతే ‘లేదు’ అని సమాధానం చెప్పాలి. సభలో ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పరు. ఒకవేళ చెప్పినా దానిలో సరైన సమాచారం ఇవ్వరని అందరూ భావించేలా వ్యవహరించవద్దు,” అంటూ విద్యాశాఖ మంత్రిగారికి మండలిలో ఉపాధ్యాయుడు చురకలు వేశారు.

ప్రాధమిక విద్యలో సంస్కరణల పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రయోగాలతో మొత్తం ప్రాధమిక విద్యా వ్యవస్థ కుప్ప కూలిపోయిందని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ముఖ్యంగా 3,4,5 తరగతుల విలీనం, సబ్జెక్ట్ టీచర్ విధానం, హేతుబద్దీకరణ, తెలుగు మీడియంను తొలగించడం వంటి ప్రయోగాలతో ప్రాధమిక విద్యా వ్యవస్థలో చాలా అనర్దం జరిగిందని అన్నారు. మొత్తం 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీఈవోలు నివేదికలు ఇస్తే ఒక్క పోస్టు కూడా ఖాళీ లేదని మంత్రి బొత్స చెప్పడం సభను తప్పుదోవ పట్టించడమే అని అన్నారు. రాష్ట్రంలో 1.87 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఉంటే వాటిని సంస్కరణల పేరుతో 1.60 లక్షలకు కుదించిన మాట వాస్తవమా కాదా? అంటూ సభలో మంత్రి బొత్స సత్యనారాయణని గట్టిగా నిలదీశారు. వాటికి ఆయన సమాధానాలు చెప్పలేక తడబడుతూ ‘తర్వాత మాట్లాడుకొందాం,’ అని ముగించారు.

ADVERTISEMENT
Latest Stories