ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డికి వైసీపీతో కనెక్షన్ కట్ అవుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. ముందు మంత్రి పదవి నుంచి తొలగించారు. అయినా సర్దుకుపోతుంటే ఇప్పుడు సిఎం జగన్కు స్వాగతం చెప్పేందుకు వస్తే ఆయనను హెలీప్యాడ్ వద్దకు అనుమతించలేదు.
ఈబీసీ పధకానికి బటన్ నొక్కేందుకు సిఎం జగన్ బుదవారం మార్కాపురం వచ్చినప్పుడు మంత్రి ఆదిమూలపు సురేష్ కారుని హెలీప్యాడ్ వద్దకు వెళ్ళేందుకు పోలీసులు అనుమతించారు కానీ తర్వాత వచ్చిన ఎమ్మెల్యే బాలినేని కారును అనుమతించలేదు. దీంతో అలిగి వెళ్లిపోగా, సిఎం జగన్ ఫోన్ చేసి బుజ్జగించి రప్పించి ఆయన చేతే ఆ బటన్ ఒత్తించి శాంతింపజేశారు.
అయితే తనను ఇంతగా అవమానించినవారు “ఎంత పెద్దవారైనా” విడిచిపెట్టే ప్రసక్తే లేదని బాలినేని శపదం చేసిన్నట్లు సమాచారం. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వ్యక్తే తనకి పొగ పెడుతున్నట్లు బాలినేని తన సన్నిహితుల వద్ద అనుమానం వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తోంది.
కనుక బాలినేనికి మంత్రి పదవి ఊడగొట్టి, ఇప్పుడు అవమానించగల కెపాసిటీ వైసీపీలో ఎవరికుంది?తాడేపల్లిలో ఆ వ్యక్తి ఎవరు?అనే సందేహం కలుగుతుంది. వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పుతూ తసమదీయుల తోకలు కత్తిరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డే ఆ వ్యక్తి అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదివరకు నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లినప్పుడు, ప్రెస్మీట్లో మాట్లాడుతూ ఇటువంటి చవకబారు రాజకీయాలు పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే చేస్తారని ఆరోపించిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. కనుక సజ్జల రామకృష్ణారెడ్డే బాలినేనికి పొగపెడుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కానీ ఈ వ్యవహారం ఇంకా పెద్దదైతే వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలు, ప్రతిపక్షాలు, మీడియా అందుకొని మాట్లాడటం మొదలుపెడితే పార్టీలో అసమ్మతి మంటలు వ్యాపిస్తాయని గ్రహించిన వైసీపీ ప్రభుత్వం, వెంటనే నష్ట నివారణ ప్రయత్నంలో భాగంగా హెలీప్యాడ్ వద్ద బాలినేని వాహనాన్ని అడ్డుకొన్న సిఐ కొండపి శ్రీనివాసరావుకు నోటీస్ జారీ చేసింది.
దీంతో ఇది పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కావని, ‘జస్ట్ ప్రోటోకాల్ సమస్య’ మాత్రమే అని పెద్ద సమస్యను చిన్నది చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నట్లుంది. కానీ బాలినేని శపధం మాటేమిటి?



