వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయం ఇతర పార్టీల అధినేతల రాజకీయానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఓదార్పు యాత్రతో మొదలైన జగన్ రాజకీయం ప్రస్తుతం పరామర్శ యాత్రలతో కొనసాగుతుంది.
లిక్కర్ కేసులో అరెస్టయ్యి జైలుకెళ్లిన వారిని, డ్రగ్స్ తీసుకుని రోడ్ల మీద అసాంఘిక చర్యలకు దిగే ఆకతాయి మూకలని, రాష్ట్ర ముఖ్యమంత్రి ని నడిరోడ్డు మీద బూతులు తిడుతూ వీరంగం సృష్టించే నేతలను పరామర్శించేందుకు రప్ప రప్ప నినాదాలు చేసుకుంటూ రోడ్ల మీదకు వచ్చే జగన్, రాజకీయాలలో సీనియర్ మోస్ట్ నాయకుడు, వైసీపీ లో కీలక నేత అయిన బొత్స విషయంలో ఎందుకు వెనక్కి తగ్గారు.?
బ్రెయిన్ స్ట్రోక్ తో అనారోగ్యం పాలై హైద్రాబాద్ లో చికిత్స తీసుకుని ఏపీకి తిరిగొచ్చిన బొత్స ను పరామర్శించేందుకు జగన్ ఎందుకు తాడేపల్లి ప్యాలస్ గడప దాటలేకపోయారు.? హైద్రాబాద్ లో చికిత్స పొందినప్పటికీ బొత్స ఇప్పటికి పూర్తిగా కోలుకోలేదని నేడు శాసనమండలి సమావేశాలలో స్పష్టంగా కనిపించింది.
సభలో వైసీపీ గొంతు బలంగా వినిపిస్తూ కూటమి ప్రభుత్వ పెద్దల పై విరుకుపడే బొత్స నేడు సభలో మరోమారు అస్వస్థతకు గురయ్యారు. దీనితో వెంటనే తేరుకున్న సభ్యులు ఆయనకు అవసరమైన ఎమెర్జెన్సీ చికిత్సను అందించారు. అయితే పార్టీ కోసం ఇంతలా గళం విప్పిన నేత అనారోగ్యానికి గురైతే ఆయనను పరామర్శించేందుకు జగన్ కి సమయం లేదా.?
బాబు ని బూతులు తిట్టిన అంబటిని కాపు టైగెర్ అంటూ కీర్తిస్తూనే ఆయన కోసం జగన్ అంబటి ఇంటికి పరామర్శకు వెళ్లారు. అలాగే పార్టీలోని కాపు నేతలందరినీ ఆయన ఇంటికి పంపారు. ఇక ఇన్నాళ్లు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న కొడాలి, వల్లభనేని ని సైతం రంగంలోకి దింపారు.
ఇక ఆ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో కుల రాజకీయాలు మొదలుపెట్టారు. ఒక్క అంబటి విషయంలోనే కాదు బాబు సతీమణి భువనేశ్వరి ని అవమానించిన వల్లభనేని కి జగన్ పరామర్శ దక్కింది. బాబు ఇంటి పైకి దాడికి వెళ్లిన జోగి విషయంలోనూ జగన్ ముందుకొచ్చారు.
అలాగే లిక్కర్ కేసులో అవినీతి అంటూ ఆరోపణలు ఎదుర్కున్న వైసీపీ రెడ్డి నాయకులకు జగన్ పరామర్శ అందింది, ఇక పవన్ పై ఆయన కుటుంబం పై దిగజారి మాట్లాడిన పోసాని కి ఈ అవకాశం దక్కింది. కానీ సీనియర్ కాపు నాయకుడు అయిన బొత్స విషయంలో జగన్ పరామర్శ ఏమయ్యింది.?
అంటే జగన్ పరామర్శ కేవలం బాబు కుటుంబీకులను బూతులు తిట్టిన వారికీ, పవన్ పై బూతులతో విరుచుకుపడిన వారికే సొంతమా.? లేదా కోట్ల అవినీతి స్కాం లో ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికే ఆ అవకాశమా.? ఇలా పార్టీ కోసం పద్దతిగా రాజకీయం చేసి, అనారోగ్యానికి గురైన వారు జగన్ దృష్టిలో పడరా.?
గతంలో కూడా ఇదే మాదిరి జగన్ యాత్రలో ఆయన కారు కిందే పడి ప్రాణాలు కోల్పోయిన వైసీపీ కార్యకర్తకు కూడా జగన్ ఓదార్పు దక్కలేదు. బాధితులనే తన ఇంటికి పిలిపించుకుని ఆ పాపాన్ని కూడా లోకేష్ పై రుద్దే ప్రయత్నం చేసారు. మరి బొత్సకు కూడా జగన్ పరామర్శ దక్కాలంటే బొత్స కూడా కూటమి ప్రభుత్వ పెద్దల పై బూతులతో విరుకుపడాలా, లేదా కోట్ల అవినీతి స్కాం లో అరెస్ట్ అవ్వాలిసిందేనా.?




