అలనాడు రామాయణంలో రావణాసురుడు, మహాభారతంలో భీష్ముడు యుద్ధంలో ఓడి అంతిమ ఘడియల కోసం ఎదురు చూస్తున్నప్పుడు, శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణుడుని, శ్రీకృష్ణుడు పాండవులని వారి వద్దకు వెళ్ళి రాజనీతి గురించి తెలుసుకోమని పంపారు.
వారు తమ చేతిలో ఓడిన ప్రాణాలు పోగొట్టుకొంటున్న శత్రువులే అయినప్పటికీ వారి వద్దకు వెళ్ళి సవినయంగా అడిగి వారి నుంచి అనేక విషయాలు తెలుసుకున్నారు.
జాతీయ అంతర్జాతీయ క్రికెట్, ఫుట్ బాల్ క్రీడాకారులు ఇదేవిధంగా తమ ప్రత్యర్ది టీమ్లు, వాటిలో ఆటగాళ్ళ ఆట తీరు, బలాబలాలు, బలహీనతలను వీడియోలలో చూసి మెళకువలు నేర్చుకుంటారు. తదనుగుణంగా తమ ఆట తీరులో లోపాలను సవరించుకొని మెరుగుపరుచుకుంటారు. తగిన వ్యూహాలతో వెళ్ళి చిత్తుచిత్తుగా ఓడిస్తుంటారు.
ఇదే సూత్రం మన రాజకీయ పార్టీల నేతలు కూడా పాటించవచ్చు. అయితే వారేమీ శత్రువుల వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అహాన్ని చంపుకొని ప్రత్యర్ధుల ముందు చేతులు కట్టుకొని పాఠాలు చెప్పించుకోనవసరం లేదు.
కానీ పార్టీలో అంతర్గతంగా లేదా ఏకాంతంగా ఉన్నప్పుడైనా తమలో అహంభావం, భేషజాలు పక్కన పెట్టి తమ రాజకీయ ప్రత్యర్ధుల ఎదుగుదలని, వారి తప్పుప్పులను, క్లిష్టసమయంలో వారు సమస్యలను ఏవిధంగా ఎదుర్కొని బయటపడ్డారు? ఎందుకు దెబ్బ తిన్నారు? ఎందుకు లాభపడ్డారు? అనే విషయాలు నిశితంగా ఆలోచించి వాటి నుంచి మంచి పాఠాలు నేర్చుకోవచ్చు.
ప్రతీది మన సొంత అనుభవంతోనే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇతరుల జీవితాల నుంచి కూడా నేర్చుకోవచ్చు…. మనం నష్టపోకుండా!
కానీ ఇప్పటి రాజకీయ నాయకులలో చాలా మంది అహం, అసూయ, ద్వేషభావం, అభ్రదతాభావం వంటి పలు కారణాల వలన ఆత్మవిమర్శ చేసుకునేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రత్యర్ధుల ఎదుగుదలని చూసి అసూయపడుతుంటారే తప్ప ప్రత్యర్ధుల నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు.
తమ అహంభావమే తమని, తమ పార్టీలను నిలువునా ముంచేసిందని వారికి తెలుసు. కానీ ఇది మనసులో ఒప్పుకోవడానికి కూడా అహం అడ్డొస్తుంది. ఆత్మవిమర్శ చేసుకుని లోపాలు సరిదిద్దుకునేందుకు అహం అడ్డు రాకపోయి ఉంటే, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి పవన్ కళ్యాణ్లా విజయం సాధించి ఉండేవారు.
కానీ ఆత్మవిమర్శ చేసుకునేందుకే అహం అడ్దొస్తున్నప్పుడు, బహిరంగంగా కనీసం పార్టీలో అంతర్గతంగా తప్పులు, లోపాలను ఎలా అంగీకరించగలరు?ఎలా సరిదిద్దుకోగలరు? అలాంటప్పుడు విజయం ఎలా సాధించగలరు?
ఇంతకీ విషయం ఏమిటంటే, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం వికారాబాద్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జిల్లా అధ్యక్షుల శిక్షణా శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా అయన కొన్ని మంచి విషయాలు చెప్పారు. అయన తమ పార్టీ జిల్లా అధ్యక్షులకు ఈ మాటలు చెప్పి ఉండవచ్చు.
కానీ అన్ని పార్టీలకు, వాటిలో నేతలకు ఇలాంటి విషయాలు నేర్చుకోవడం చాలా అవసరమే. ఆయనేమన్నారో అయన మాటల్లోనే….
నేను పీసీసీ అధ్యక్షుడిని అయ్యాక ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లి కలిసి మద్దతు అడిగాను: సీఎం రేవంత్
కలిసికట్టుగా పని చేయడం వల్లే రెండున్నర శాతం ఉన్న కాంగ్రెస్ 40 శాతం ఓట్లు తెచ్చుకుని అధికారంలోకి వచ్చింది
జిల్లాకు అధిపతులమయ్యామని డీసీసీ అధ్యక్షులు భావించవద్దు
వ్యతిరేకించిన వాళ్లను… pic.twitter.com/3KP1fRzVtN
— BIG TV Breaking News (@bigtvtelugu) February 21, 2026




