సంక్షేమానికే అంకితం! గర్వపడలా.. బాధపడలా?

YS_Jagan_Raithu_Barosaతెనాలిలో ఈరోజు వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలని ఉద్దేశ్యించి ప్రసంగించారు. మూడున్నరేళ్ళ తన పాలనలో రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ సంక్షేమ పధకాలు అందించానని గర్వంగా చెప్పుకొన్నారు. మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో చూసుకోండి… ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాము. ఇన్నేళ్ళుగా ఇంత భారీ స్థాయిలో సంక్షేమ పధకాలు అమలుచేయలేదని, ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి దోచుకోవడ, దాచుకోవడం, పంచుకోవడం మాత్రమే తెలుసునని సిఎం జగన్‌ విమర్శించారు.

తాను సంక్షేమ పధకాల ద్వారా ప్రజల కళ్ళలో వెలుగులు నింపుతుంటే, దుష్టచతుష్టయం, వారి దత్తపుత్రుడు ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని సిఎం జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ పధకాలు ఎందుకు అమలుచేయలేకపోయాడు? అని ప్రశ్నించారు.

ADVERTISEMENT

చంద్రబాబు పాలనకి తన పాలనకి వ్యత్యాసం చూసి ప్రజలు ఓట్లు వేయాలని సిఎం జగన్‌ ప్రజలని కోరారు. తన ప్రభుత్వం ప్రజలకి ఎంతో మేలు చేసింది కనుకనే వచ్చే ఎన్నికలలో 175 సీట్లకి పోటీ చేసి గెలుచుకోగలమని నమ్మకంగా చెపుతున్నామని సిఎం జగన్‌ అన్నారు. టిడిపి, జనసేనలు 175 సీట్లలో పోటీ చేసి గెలవగలమని నమ్మకంగా చెప్పగలవా? అని ప్రశ్నించారు.

కూర్చొని తింటుంటే కొండలైనా కరిగిపోతాయని పెద్దలు అంటారు. గత మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది… ఇక ముందు కూడా చేయమంటున్నదీ ఇదే.

“మేము సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచిపెడుతుంటాము… మీరు (ఓటర్లు) వైసీపీకే ఓట్లు గెలిపిస్తుండండి,” అని కోరుకొంటున్నట్లు సిఎం జగన్‌ మాటలతో స్పష్టమవుతోంది. ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి చూపించి వారంతట వారు సంపాదించుకొనేలా చేసి, ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఉండేలా చేయాలి. ఏ ప్రభుత్వామైనా అదే చేస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎల్లకాలం ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడి జీవించాలని కోరుకొంటోంది!

ఏ వాదన తప్పనుకొంటే వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పధకాలకి బదులు రాష్ట్రానికి పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, వాణిజ్య సంస్థలని రప్పించేందుకు గట్టిగా కృషి చేసి, ఎక్కడిక్కడ పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయలు కల్పించి ఉండేది. చంద్రబాబు నాయుడు అదే చేశారు. అందుకే నేడు రాష్ట్రంలో ఈమాత్రం అయినా పరిశ్రమలు, వాటిలో ఉద్యోగాలు ఉన్నాయి.

కానీ ఆవిదంగా చేస్తే ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంత ఆలోచనలు చేస్తారని సిఎం జగన్‌ భావించిన్నట్లున్నారు. అందుకే ఉద్యోగాల కల్పనకి బదులు సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకి డబ్బు పంచిపెడుతూ, వాటి కోసం మళ్ళీవైసీపీకే ఓట్లు వేయాలని కోరుతున్నారని అర్దం అవుతోంది.

అయితే ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకి నెలనెలా జీతాలు కూడా చెల్లించలేని దుస్తితికి చేరుకొన్న ప్రభుత్వం, ఇంకా ఎంతకాలం ఈ సంక్షేమ పధకాలని కొనసాగించగలదు?వాటి కోసం ఇంకా ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేయగలదు?ఆదాయం లేకుండా ఆ అప్పులు, వాటి వడ్డీలు ఏవిదంగా తిరిగి చెల్లించగలదు?చెల్లించకపోతే రాష్ట్రం పరిస్థితి ఏమిటి?అని ఆలోచిస్తే ఈ సంక్షేమ పాలన ఎంత లోపభూయిష్టమైనదో ఎంత ప్రమాదకరమైనదో అర్దమవుతుంది. కనుక మన కాళ్ళ మీద మనం నిలబడేలా చేయగల ప్రభుత్వమే అవసరం తప్ప కూర్చోబెట్టి ఎల్లకాలం మేమే గోరుముద్దలు తినిపిస్తామనే ప్రభుత్వం కాదు.

ADVERTISEMENT
Latest Stories