వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేలా జాగ్రత్తపడతామని పవన్ కళ్యాణ్ పదేపదే చెపుతున్నారు. టిడిపి, జనసేనలు కలిసి పనిచేస్తాయని చెప్పా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పారు. అప్పటి నుంచే సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నేతలలో ఆందోళన మొదలైంది. ఆ రెండు పార్టీలని దూరంగా ఉంచడానికి వారు చేస్తున్న వాదనలు, విసురుతున్న సవాళ్ళు నిత్యం రాష్ట్ర ప్రజలందరూ వింటూనే ఉన్నారు. అయితే ఆ ప్రయత్నంలో వైసీపీ తన అభద్రతాభావాన్ని పదేపదే బయటపెట్టుకొంటున్నట్లు అవుతోంది తప్ప తమ వాదనలతో వాటిని దూరంగా ఉంచలేకపోతున్నారు.
వచ్చే ఎన్నికలలో వైసీపీ ఒంటరిగా పోటీ చేసి 175 సీట్లు గెలుచుకొంటుందని ఓ పక్క ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు, ఇక ప్రతిపక్షాలు ఎవరితో ఎవరు పొత్తులు పెట్టుకొంటే వైసీపీకి ఎందుకు?అంటే 175 సీట్లు గెలుచుకొంటామనే నమ్మకం వైసీపీకి లేదన్నమాట! పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ టిడిపి, జనసేనలు కలిస్తే వైసీపీ నష్టపోతుందని లోలోన ఆందోళన చెందుతున్నారన్న మాట! ఈవిషయం రాష్ట్ర ప్రజలు అర్దం చేసుకోలేరనుకోవడం అవివేకమే కదా?
అయినా ఒంటరిగా పోటీ చేసి 175 సీట్లు గెలుచుకోగలమని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకొంటునప్పుడు మరి ఐ-ప్యాక్ని ఎందుకు నియమించుకొన్నట్లు?అంటే ఓటమి భయంతోనే అని అర్దం అవుతోంది. కనుక టిడిపి, జనసేనళ పొత్తుల గురించి సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నేతలు పదేపదే మాట్లాడుతుండటం, వాటిని వేర్వేరుగా 175 సీట్లకు పోటీ చేయాలంటూ సవాళ్ళు విసరడం వలన ప్రజలకు వైసీపీ తప్పుడు సంకేతాలు పంపిస్తున్నట్లే అవుతోందని చెప్పవచ్చు. చివరికి ఈ వాదనలతోనే వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకొన్నా ఆశ్చర్యం లేదు.



