తెలంగాణ రాష్ట్రంలో కళ్ళకు కనబడేంతగా అభివృద్ధి జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, సాగునీరు, త్రాగునీటి వసతి ఏర్పడింది. నెలనెలా కనీసం ఓ రూ.2-3,000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు లేదా ఐటి కంపెనీలు ఏర్పాటవుతూనే ఉన్నాయి. వాటి ద్వారా లక్షలాదిమందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వాటితో ప్రజల ఆర్ధికస్థితి, జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో రియల్ ఎస్టేట్, రవాణా, వినోదం, హోటల్ తదితర రంగాలన్నీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఆర్ధికంగా బలంగా ఉంది కనుక సంక్షేమ పధకాలు కూడా విరివిగా అమలుచేస్తోంది. ఇవన్నీ ఏపీ ప్రజలు, ప్రభుత్వం, దానిలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కళ్ళారా చూస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేసి ఇన్ని సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 119 సీట్లలో 100 వరకు గెలుచుకోగలమని చెప్పుకొంటున్నారు తప్ప 119 గెలుచుకొంటామని గొప్పలు చెప్పుకోవడం లేదు.
కానీ ఈ మూడున్నరేళ్ళలో ఏపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. అయినా వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మేమే గెలుచుకోగలమని సిఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు అన్ని సీట్లు ఎందుకు ఇవ్వాలంటే ఇంటింటికీ సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచుతున్నాము కనుక! అని చెప్పుకొంటున్నారు.
తెలంగాణని ఇంతగా అభివృద్ధి చేసిన కేసీఆర్ కూడా ఇంత నమ్మకంగా చెప్పుకోలేకపోతున్నారు. ఇంత ధీమాగా అడగలేకపోతున్నారు. కానీ ఏమీ చేయకపోయినా 175 సీట్లు మాకే అని జగనన్న అంటున్నారు!
అసలు ఈ 175 సీట్ల కధేమిటి? అని ఆలోచిస్తే ఇదీ ఐ-ప్యాక్ వ్యూహం అని అర్దం అవుతుంది. ప్రతీ ఎన్నికలలో ప్రతీ పార్టీ ఏదో ఓ ఆకర్షణీయమైన నినాదం ఎత్తుకొంటుంది. ఇదీ అలాగే రాబోయే ఎన్నికల కోసం సృష్టించుకొన్నది కావచ్చు. పదేపదే 175 సీట్లు మేమే గెలుచుకోబోతున్నామంటూ చెప్పుకొంటే ప్రజలు కూడా నమ్మేసి గుడ్డిగా ఓట్లేసేస్తారనే భ్రమ కావచ్చు లేదా ఐ-ప్యాక్ నివేదికలు చూసి ఆందోళన చెందుతున్న వైసీపీ ఎమ్మెల్యేలకి ధైర్యం చెప్పుకోవడం కోసం కావచ్చు లేదా మరోటి కావచ్చు.
రాష్ట్రాభివృద్ధికి ఏమీ చేయకపోయినా 175 సీట్లు మేమే గెలుచుకొంటామని వైసీపీ భ్రమలో ఉండాలనుకొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు కూడా. కానీ టిడిపి, జనసేనలు 175 సీట్లలో పోటీ చేయగలవా?అని సవాళ్ళు విసురుతుండటమే విడ్డూరంగా ఉంది. ఒకవేళ అవి పోటీ చేయలేకపోతే అవే నష్టపోతాయి కానీ వైసీపీ కాదు కదా? మరెందుకు వాటి గురించి వైసీపీ ప్రశ్నిస్తోంది?అంటే ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోకుండా వేర్వేరుగా పోటీ చేస్తే ఓట్లు చీలి వైసీపీకి మేలు కలుగుతుందనే దురాలోచనతోనే!
అయితే ఈసారి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోనీయనని పవన్ కళ్యాణ్ పదేపదే చెపుతున్నారు కదా?అందుకోసం టిడిపి, జనసేనలు ఏవిదంగా సీట్ల సర్దుబాట్లు చేసుకొంటాయో వాటిష్టం. కానీ ఆ రెండూ పొత్తులు పెట్టుకొంటే వైసీపీకి నష్టం జరుగుతుంది కనుక పదేపదే ఇలాంటి సవాళ్ళు విసురుతున్నట్లు భావించవచ్చు. కానీ ఈ సవాళ్ళ ఉచ్చులో టిడిపి, జనసేనలు చిక్కుకోవని సిఎం జగన్ ఈపాటికే గ్రహించే ఉంటారు కనుక వాటిని ఎదుర్కొనేందుకు ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే మంచిదేమో?



