వైఎస్ వివేకానంద రెడ్డి 2019, మార్చి 15న తన నివాసంలో దారుణహత్యకు గురయ్యారు. నాలుగేళ్ళు గడిచిపోయినా ఇంతవరకు హంతకులు ఎవరో, వారి వెనుకున్నవారు ఎవరో నిర్ధారించలేదు. కనుక ఎవరికీ శిక్షలు పడలేదు. ఏపీలో సీబీఐ కూడా స్వేచ్ఛగా, ధైర్యంగా విచారణ చేయలేకపోతోందని గుర్తించిన వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించి కేసు విచారణను హైదరాబాద్కు బదిలీ చేయించుకొన్నారు. దాంతో కేసు విచారణ వేగవంతమైంది. కానీ మళ్ళీ హటాత్తుగా నత్తనడకలు నడుస్తోంది. సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ప్రాధేయపడి కేసు ముందుకు సాగకుండా బ్రేకులు వేయించారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అది వేరే సంగతి.
వివేకాను ఎవరు హత్య చేశారనే విషయం సీబీఐ, హైకోర్టు ఎలాగూ తేలుస్తాయి కనుక ఇప్పుడు ఆ చర్చ అనవసరం. అయితే వివేకా హత్య తర్వాత వైసీపీ నేతలు ఎన్ని కధలు చెప్పారో ఈ సందర్భంగా ఓసారి గుర్తు చేసుకోక తప్పదు.
1.వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో రక్తం కక్కుకొని చనిపోయారని వైసీపీ నేతలు మొదట చెప్పారు.
2.వివేకా కుమార్తె సునీత పోస్టుమార్టం చేయాలని కోరడంతో గుండెపోటు కాదు హత్య అని వైసీపీ నేతలే ప్రకటించారు.
3.చంద్రబాబు నాయుడే ఆయనను హత్య చేయించారని ప్రచారం చేశారు.
4.చంద్రబాబు నాయుడు సీబీఐ మీద ఒత్తిడి చేసి అవినాష్ రెడ్డే ఈ హత్య చేయించారని కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
5.సీబీఐ అధికారులు ఈ కేసులో వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా, అవినాష్ రెడ్డే హంతకుడు అని ముందే నిర్ధారించుకొని గూగుల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిరూపించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
6.వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్లో వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి మామ ఆస్తి కోసం హత్య చేశారని, కనుక ఇది ఆస్తికోసం జరిగిన హత్య అని వాదించారు. కానీ వారు సీబీఐ ఈ కేసులో అన్యాయంగా తనను ఇరికేయించారని వాదించారు.
7.అవినాష్ రెడ్డి తండ్రి వేసిన తాజా పిటిషన్లో ఈ హత్య కేసులో నిందితులలో ఒకడైన సునీల్ యాదవ్ తల్లిని వైఎస్ వివేకానందరెడ్డి లైంగికంగా వేధించారని,ఆ కక్షతోనే సునీల్ యాదవ్ వివేకాను హత్య చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.
8.ఈ కేసులో అప్రూవరుగా మారిన దస్తాగిరితో సునీతారెడ్డి కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ఈ కేసులో అప్రూవరుగా మారిన దస్తాగిరితో సునీతారెడ్డి కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు.
ఈ కేసును విచారణను నాలుగేళ్ళు అయినా పూర్తిచేయనందుకు సుప్రీంకోర్టు సీబీఐ అధికారి రాంసింగ్ను మార్చాలని ఆదేశించడంతో ఆయన స్థానంలో కెఆర్ చౌరాసియాని నియమితులయ్యారు. ఈ నెల 30వ తేదీ లోగా ఈ కేసు విచారణను పూర్తిచేసి వివేకా హత్య కుట్రను చేధించాలని సుప్రీంకోర్టు గడువు విధించింది కూడా. కానీ గడువులోగా వివేకాను ఎవరు హత్య చేశారో సీబీఐ బయటపెట్టి శిక్ష ఖరారు చేయించగలిగితే ఏమవుతుందో అందరికీ తెలుసు. కనుక ఈ కేసు పూర్తయ్యేలోగా ఇంకెన్ని కధలు చెప్తారో చూడాలి.



