మూడున్నర దశాబ్దాల చరిత్ర, రాజకీయ, పరిపలనానుభవం ఉన్న టీడీపి ఈ సుదీర్గ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది… మళ్ళీ మళ్ళీ ఎన్నికలలో గెలుస్తూ అధికారంలోకి వస్తూనే ఉంది. ఈ విషయంలో వైసీపీ కూడా ఎన్నడూ వెనుక బడలేదనే చెప్పాలి. నిజం చెప్పలంటే ఎన్నికలు వాటి కోసం కుల,మత సమీకరణాలను బట్టి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలు రచించుకుంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూనే ఉంది.
టీడీపి కూటమి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పాలన, అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులపై చూపినంత శ్రద్ధ ఓటు బ్యాంకు రాజకీయాలపై చూపవనే చెప్పాలి. కానీ వైసీపీ తొలిసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పుడే మొదటి రోజు నుంచే 5 ఏళ్ళ తర్వాత అంటే 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కార్యాచరణ ప్రారంభించేయడం అందరూ చూశారు.
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు దాన్ని కార్యాచరణ టీడీపి, జనసేనలకు 5 ఏళ్ళపాటు నిత్యం అగ్నిపరీక్షలు పెడుతూనే ఉన్నాయి.
ఇప్పుడు కూడా వైసీపీ 2029 ఎన్నికల కోసం కార్యాచరణ మొదలుపెట్టేసింది. పార్టీలో కాపులను కాదని రెడ్లకు ప్రాధాన్యం ఇవ్వడం పెద్ద పొరపాటని గ్రహించింది. కనుక పార్టీలో కాపు నేతలను ముందుకు తెస్తోంది.
కేంద్ర ఎన్నికల కమీషన్ తాజాగా రాష్ట్రంలో ఓట్ల జాబితాల సవరణ కార్యక్రమం త్వరలో చేపట్టబోతోంది. కూటమి పార్టీలు ఇంకా మేల్కొన్నాయో లేదో తెలీదు కానీ వైసీపీ ముందే మేల్కొంది.
సోమవారం తాడేపల్లి ప్యాలస్లో వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి జిల్లాల సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. “ఓట్ల జాబితాల సవరణ ప్రక్రియలో దొంగ, నకిలీ ఓట్లు పేరుతో వైసీపీ ఓట్లు తొలగించే ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే దొంగ ఓట్లు చేర్చకుండా మనమందరం డేగ కళ్ళతో కనిపెట్టుకొని ఉండాలి.
ఈ దశలో మనం అప్రమత్తంగా లేకపోతే ఎన్నికలలో తీవ్రంగా నష్టపోతాము. కనుక వైసీపీలో ప్రతీ ఒక్కరూ ఈ ఓట్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎక్కడ ఇలాంటి తప్పుడు పనులు జరుగుతున్నా వెంటనే అడ్డుపడాలి,” అని హితోపదేశం చేశారు. మరి టీడీపి, జనసేన, బిజేపిలు దీని గురించి ఇంకా ఆలోచించాయా లేదో?




