పొత్తులపై అస్పష్టతతో ఉన్న టిడిపి, జనసేనలను కలిపింది ఎవరు?అంటే అవి కలవకూడదని కోరుకొన్న జగన్మోహన్ రెడ్డే. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి వాటి అయోమయాన్ని దూరం చేసి వాటిని దగ్గర చేసిన పుణ్యం ఖచ్చితంగా ఆయనకే దక్కుతుంది.
కానీ నేటికీ వాటిని ఏదో విదంగా విడగొట్టేందుకు వైసీపి నేతలు, వారి ఆత్మసాక్షి చేయని ప్రయత్నం లేదు. అయితే వారందరూ టిడిపిని కాకుండా జనసేన మీద ఎందుకు దృష్టిపెడుతున్నారు?అంటే రాజకీయాలలో తల పండిన చంద్రబాబు నాయుడుని, టిడిపి నేతలను తమ మాటల గారడీతో బురిడీ కొట్టించలేమని వైసీపికి తెలుసు కనుకనే.
అందుకే కాస్త ఆవేశపరుడైన పవన్ కళ్యాణ్ని, పెద్దగా రాజకీయ అనుభవం లేని జనసేన నేతలని, పవన్ కళ్యాణ్ని దేవుడిగా ఆరాదించే జనసైనికులను ఏదోవిదంగా రెచ్చగొట్టి టిడిపి నుంచి విడదీసేందుకు వైసీపి విశ్వప్రయత్నాలు చేస్తోందని చెప్పవచ్చు.
వారి ఆత్మసాక్షి ఈరోజు ఆన్లైన్ సంచికలో ‘చంద్రబాబు కుర్చీలాట… పావుగా పవన్ కళ్యాణ్,’ అనే కధనంలో వైసీపి ఆస్థాన సలహాదారు కొమ్మినేని శ్రీనివాస రావు తన అనుభవాన్ని, భాషాపటిమని అంతా రంగరించి జనసేన అధినేతని నారా లోకేష్, చంద్రబాబు నాయుడు అవమానిస్తున్నారని కనిపెట్టి చెప్పారు.
ఎందుకంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారని నారా లోకేష్ చెప్పడమే కారణమట! ఏం పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా?ఆయనని ముఖ్యమంత్రిగా చేసేందుకు జనసేన అన్ని సీట్లు గెలుచుకోలేదా?కానీ నారా లోకేష్ పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదని పోలిపల్లి సభలో తేల్చేశారని, అది విని జనసైనికులు అందరూ ఎంతో నొచ్చుకొని సభ మద్యలోనే వెళ్లిపోయారని కొమ్మినేని ఎవరికీ తెలియని విషయం కనిపెట్టి చెప్పారు.
పవన్ కళ్యాణ్ ప్రసంగం అంతా ఆడవాళ్ళగోల, నారా లోకేష్ ప్రసంగం ఎర్రడైరీ ఎర్రిగోల, బాలకృష్ణ ప్రసంగం మెంటల్ ప్రసంగం అని కొమ్మినేని తేల్చిపడేశారు. చంద్రబాబు నాయుడు సినిమా ఫంక్షన్కి యాంకరింగ్ చేస్తున్నట్లు స్టేజీపై అటూ ఇటూ తిరుగుతూ కొత్త కొత్త అబద్దాలు చెపుతూ బోర్ కొట్టించేశారని కొమ్మినేని కనిపెట్టి చెప్పారు.
టిడిపి, జనసేనలు కలిసినా, ఇటీవల చంద్రబాబు నాయుడుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయినా ఆందోళనతో పిచ్చి వాగుడు వాగుతున్నది ఎవరు?ఎందుకు? అంటే సమాధానం అందరికీ తెలుసు.
ఇప్పుడు పోలిపల్లి సభ గురించి కూడా ఈ వాగుడు దేనికంటే అది విజయవంతమైందనే ఏడుపే! ఆ ఏడుపులో కూడా ఏదోవిదంగా జనసేనను రెచ్చగొట్టి టిడిపి నుంచి విడగొట్టాలనే మరో ఏడుపు వినిపిస్తోంది.
టిడిపి, జనసేనలను విడగొట్టేందుకు వైసీపి నేతలు, వారి ఆత్మసాక్షి కలిసికట్టుగా ‘పట్టరా పట్టు హైలెస్సా… ‘ అంటూ మరోసారి ప్రయత్నిస్తున్నట్లున్నారని అర్దమవుతూనే ఉంది. ఎన్నికల గంట మ్రోగి, పోలింగ్ జరిగే వరకు కూడా వైసీపిలో అందరూ మళ్ళీ మళ్ళీ ‘హైలెస్సా… హైలెస్సా’ అంటూనే ఉంటారు.
టిడిపి, జనసేనలు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వారి బోటుని వైసీపి ముంచేయడం ఖాయం. కనుక టిడిపి, జనసేనలు కూడా ‘పట్టరపట్టు…’ అంటూ మరింత కలిసికట్టుగా ముందుకు సాగాల్సి ఉంటుంది.




