2024 మార్చ్ లో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ గా ఉన్న కేసీఆర్ కుమార్తె కవిత ను ఈడీ అధికారులు అరెస్టు చేసి తీహార్ జైలుకి తరలించారు. అయితే ఇదంతా కేసీఆర్ పై రాజకీయ కక్ష్య సాధింపు కోసం బీజేపీ వేసిన రాజకీయ వ్యూహమని, తానూ ఈ కేసు నుంచి కడిగిన ముత్యం లా బయటకొస్తానంటూ ఆనాడే కవిత ప్రకటించారు.
అయితే ఆ ప్రకటనను నేడు ఢిల్లీ హై కోర్ట్ నిజం చేస్తూ కవితకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. లిక్కర్ కేసులో కవిత అవినీతికి పాల్పడినట్టు అధికారులు సరైన ఆధారాలు చూపించలేకపోయినందుకుగాను కవిత పై ఉన్న కేసును కొట్టేస్తున్నట్టు ఢిల్లీ హై కోర్ట్ తీర్పిచ్చింది.
దీనితో న్యాయం గెలిచింది, నాయస్థానాల పై తనకున్న నమ్మకం నెగ్గింది, లిక్కర్ కేసు నుంచి నేను కడిగిన ముత్యంలా బయటకొచ్చాను అంటూ కవిత కోర్ట్ తీర్పు పై స్పందించారు. అయితే ఇదే తీర్పు పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడిసెంట్ కవిత సోదరుడు కేటీఆర్ సైతం తన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
కుట్రపూరిత లిక్కర్ స్కాం కేసుతో బిఆర్ఎస్ నష్టపోయిందని, కేసు కవిత మీదనైనా మూల్యం పార్టీ చెల్లించాల్సి వచ్చిందంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. అయితే కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ పై కవిత చాల ఘాటుగా స్పందించారు.
రాజకీయ పరంగా నాపై కేసులు మోపి, అరెస్టులు చేసి, జైలుకి పంపితే పార్టీ పరంగా కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు.? కానీ కోర్టు తీర్పు తనకు అనుకూలంగా రావడంతో ఇప్పుడు ఆ క్లిన్ చిట్ ని తన పార్టీకి సానుకూలంగా మార్చుకుని పార్టీ ఓటమి ని నా మేడలో వేయొద్దు అంటూ కవిత కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
అలాగే పదేళ్లు చేతిలో అధికారం పెట్టుకుని కూడా ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం వల్ల, పార్టీ తరుపున దోపిడీదారులకు టిక్కెట్లు ఇవ్వడం వల్ల, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోవడం ఫలితమే బిఆర్ఎస్ ఓటమికి కారణాలంటూ చెప్పుకొచ్చారు.
కనీసం ఇప్పటికైనా ప్రజా తీర్పుని గౌరవించి లోపాలను సరిచూసుకోండి అంటూ కవిత తన స్వరాన్ని పెంచి మరి కేటీఆర్ కి బదులు చెప్పారు. మరి కవిత రిప్లై కి కేటీఆర్ నుంచి కానీ బిఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. ఇలా ఒక్క తీర్పు మరోసారి అన్న చెల్లెళ్ళ మధ్య రాజకీయ చిచ్చుకి కారణంగా మారింది.




