ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు పూర్తిగా విముక్తి లభించింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసుపై నేడు తుది తీర్పు ప్రకటించింది.
ఈ కేసులో కల్వకుంట్ల కవితతో సహా మొత్తం 23 మందిపై సీబీఐ నమోదు చేసిన కేసులన్నిటినీ కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి జితేందర్ సింగ్ తీర్పు ప్రకటించారు. ఈ కేసులో వారందరూ అవినీతికి పాల్పడినట్లు సీబీఐ బలమైన సాక్ష్యాధారాలు చూపించలేకపోయిందన్నారు.
సీబీఐ ఛార్జ్ షీట్ కూడా లోపభూయిష్టంగా ఉందని న్యాయమూర్తి ఆక్షేపించారు. సరైన సాక్ష్యాధారాలు లేకుండానే అందరి పేర్లు ఈ కేసులో ఇరికించారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
ఈ కేసులో వారందరూ దోషులుగా నిరూపించడంలో సీబీఐ వైఫల్యం చెందిందని, కనుక ఈ కేసుని నీరుగార్చినందుకు సీబీఐ అధికారుల మీదే దర్యాప్తు జరపాలని న్యాయమూర్తి అన్నారు.
ఈ కేసులో ఆమె ఆడిటర్ బుచ్చిబాబు, మాజీ సిఎం కేజ్రీవాల్, మాజీ డెప్యూటీ సిఎం మనీష్ సిసోడియాతో సహా మొత్తం 23 మందిపై సీబీఐ కేసులని కొట్టివేస్తూ వారందరికీ ఈ కేసు నుంచి న్యాయస్థానం విముక్తి కల్పించింది.
ఈ కేసు విచారణకు మొదటిసారి నోటీస్ అందుకున్నప్పటి నుంచి కల్వకుంట్ల కవిత తాను నిరాపరాధినని, ఎటువంటి తప్పు, అవినీతికి పాల్పడలేదని చెపుతూనే ఉన్నారు.
తన తండ్రి కేసీఆర్పై రాజకీయ కక్షతోనే మోడీ ప్రభుత్వం ఈ భూటకపు కేసు సృష్టించి తనని అరెస్ట్ చేసిందని ఆరోపించేవారు. కానీ తాను కడిగిన ఆణిముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతానని పదేపదే చెప్పేవారు. ఆమె చెప్పినట్లుగానే ఇప్పుడు ఆణిముత్యంలా బయటపడ్డారు.
ఈ కేసు తదనంతర పరిణామాల కారణంగా ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యి నానా అవమానాలు భరించాల్సి వస్తోంది. అయినా ఒంటరిగా పోరాటం చేస్తూ త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్దమవుతున్నారు.
ఇలాంటి సమయంలో ఆమెకు ఈ కేసు నుంచి ఢిల్లీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చి విముక్తి కల్పించడంతో ఆమె ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. నూతనోత్సాహంతో మరింత వేగంగా దూసుకుపోయేందుకు తోడ్పడుతుంది.
ఈ తీర్పుపై ఆమె ఏవిధంగా స్పందిస్తారో ఊహించవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏవిధంగా స్పందిస్తుందో… అలాగే కాంగ్రెస్, బిజేపిల స్పందన కూడా చూడాలి.




