ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి కవిత చెప్పినట్టుగానే కడిగిన ముత్యం మాదిరి బయటకొచ్చారు. సీబీఐ తన పైన మోపిన నిందలు, చేసిన ఆరోపణలు అన్ని రాజకీయ కక్ష్య సాధింపు చర్యలో భాగమే అంటూ చెప్పుకొస్తున్న కవిత వ్యాఖ్యలకు నేడు కోర్ట్ తీర్పుతో మరింత బలం చేకూరింది.
అయితే నాడు కవిత ఢిల్లీ లిక్కర్ కేసు, ఆ పై జరిగిన పరిణామాలు అన్ని కూడా బిఆర్ఎస్ ఓటమిలో కీలక పాత్ర పోషించాయని తెలంగాణ రాజకీయ వర్గాలలో, ముఖ్యంగా బిఆర్ఎస్ శ్రేణులలో విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ నేడు కోర్టులో కవితకు అనుకూలంగా తీర్పు రావడంతో బిఆర్ఎస్ ఇకపై కవిత ను ఈ కేసుతో ముడిపెట్టి ముందుకెళ్ళలేదు.
ఇదే సమయంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం లో అవినీతి అంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు, అలాగే ఫోన్ టాపింగ్ కేసులో అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్, ఫోన్ టాపింగ్ కేసులలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు బలంగా వినిపిస్తుంది, అందుకు తగ్గట్టే ఇప్పటికే కేటీఆర్ ఈ కేసులలో పలుమార్లు విచారణను ఎదుర్కొన్నారు.
కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో నుంచి కడిగిన ముత్యం మాదిరి బయటకొచ్చిన ఈ సందర్భంలో ఇప్పుడు కేటీఆర్, కేసీఆర్ కూడా తమవంతుగా ప్రభుత్వ విచారణలను ఎదుర్కొని వారి పై వచ్చిన, వస్తున్న ఆరోపణలు అవాస్తవాలు అని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది.
వారు కూడా కవిత మాదిరి న్యాయస్థానాల నుంచి కడిగిన ముత్యాల మాదిరి బయటకు రావాల్సి ఉంటుంది. ఇక వీరితో పాటుగా హరీష్ కూడా శీల పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది. అలాకాకుండా కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఆయన పైన విచారణ కమిటీలా.? కేటీఆర్ మాజీ మంత్రి ఆయన మీద టాపింగ్ ఆరోపణలా.?
హరీష్ ప్రజామద్దతు మెండుగా ఉన్న నాయకుడు ఆయనకు అవినీతి మరకలా.? అంటూ బిఆర్ఎస్ ప్రత్యర్థుల మీద ఎదురుదాడికి దిగితే అది బిఆర్ఎస్ ను రాజకీయంగా బలపరచలేదు. కవిత మాదిరి కేసులను ఎదుర్కొని, విచారణలను తట్టుకుని న్యాయస్థానాల తీర్పులతో తమ పై పడిన అవినీతి మరకలు కడుక్కోవాలి. లేకుంటే అవి ఎప్పటికి ప్రత్యర్థి చేతికి చిక్కిన రాజకీయ అస్త్రాలుగానే మిగుతాయి.




