కల్వకుంట్ల కవిత మే మొదటి వారంలో కొత్త పార్టీ ఏర్పాటు అవుతుందని ముహూర్తం కూడా ప్రకటించేశారు. అయితే మొదట్లో ఆమె ఇలాంటి ప్రకటన చేసినప్పుడు స్పందించిన కాంగ్రెస్, బిజేపి నేతలు ఈసారి కనీసం పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ అయితే అసలు ఆమె ఉనికినే గుర్తించడం లేదు.
ఆమె బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చి దాదాపు ఆరు నెలలు కావస్తోంది. ఇన్ని నెలల్లో కాంగ్రెస్, బిజేపి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క సీనీయర్ నాయకుడు ఆమెతో చేతులు కలపలేదు. ఎందుకంటే జాగృతి ఓ సంస్థ తప్ప రాజకీయ పార్టీ కాదు కనుక.
పైగా ఆమె రాజకీయాలలో ఎంతకాలం ఒంటరిగా నిలబడి పోరాడగలరో ఇంకా తెలీదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ఆమెతో చేతులు కలిపినా, ఆమె మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతారనే అనుమానాలు కూడా ఉన్నాయి. కనుక ముందుగా ఆమె విశ్వసనీయత సంపాదిన్చుకోవాల్సి ఉంటుంది.
పవన్ కళ్యాణ్ అంతటివాడు జనసేన నిర్వహణ ఖర్చుల కోసం సినిమాలు చేయాల్సి వచ్చింది. కానీ కల్వకుంట్ల కవిత మాత్రం దాదాపు ఆరు నెలలుగా జాగృతి ఖర్చులు భరిస్తూనే ఉన్నారు. కానీ ఓ రాజకీయ పార్టీని 2029 ఎన్నికల వరకు నిర్వహణకు అంటే సభలు, సమావేశాలు, ర్యాలీలు, దీక్షలు తదితరఖర్చులను భరించే ఆర్ధిక స్తోమత కూడా చాలా చాలా ముఖ్యం. ఆమె ముందుకు సాగుతున్నారు కనుక ఉందనే అనుకోవాలి.
ఆమె రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తే రావచ్చు. ఆ పార్టీని, దాని తీరు తెన్నులను చూసిన తర్వాత ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలు ఆమె పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుంది.
కానీ ఆమె పార్టీ మనుగడ ప్రధానంగా ఆమె ఆర్ధిక స్తోమతు, ఇతర పార్టీల నాయకులను ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆకర్షించడంపైనే ఆధారపడి ఉంటుంది.
కనుక ముందుగా ఎన్నికలలోగా ఈ రెండూ సాధించి మనుగడ సాగించగలిగితే ఆ తర్వాత ఎన్నికలలో పోటీ చేయడం, గెలుపోటముల గురించి ఆలోచించవచ్చు.




