ఆక్రమణల విషయంలో ఎప్పుడు సామాన్యులే బాధితులా.?

Khammam Demolitions Raise Land Encroachment Row

అక్రమ భూ ఆక్రమణలు అంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆక్రమణలు తొలగిస్తూ ముందుకెళుతోంది. నాడు హైద్రాబాద్ లో హైడ్రా సృష్టించిన విధ్వంసాలు, అక్కడ కనిపించిన ఎన్నో హృదయవిదారక దృశ్యాలు నేటికీ బాధిత కుటుంబాలలో తీరని ఆవేదనగానే మిగిలాయి.

ఎన్నో ఆశలతో మరెన్నో కలలతో రూపాయి రూపాయి కూడబెట్టి, బ్యాంకుల వద్ద వడ్డీలకు లోన్ లు తీసుకుని, బంగారం తనకాలు పెట్టుకుని మరి ఒక సామాన్య మధ్యతరగతి వాడు తమ సొంతింటి కలను నెరవేర్చుకుంటారు. వీరికి ప్రభుత్వ ఉచిత ఇళ్లకు అనర్హులు. వారి కష్టార్జితంతో కట్టుకున్న ఇళ్లను ఇలా ప్రభుత్వాలు ఆక్రమణలని, సుందరీకరణ అని కళ్ళ ముందే కూల్చేస్తుంటే వారి కన్నీటి దారకు అడ్డుకట్టవేయగలమా.?

ADVERTISEMENT

ఇప్పుడు అటువంటి దృశ్యాలే ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో చోటుచేసుకున్నాయి. వెలుగుమట్ల భూదాన్ భూములను ఆక్రమించి అక్రమంగా లేఅవుట్లు వేసి అమ్ముకున్నారని, ఇప్పుడు ఆ ఇళ్లను కూల్చివేసి ఆ ఆక్రమణలు తొలగిస్తున్నాం అనేది ప్రభుత్వ వాదన.

అయితే ఇక్కడ ఆక్రమణ చేసినవారు బడా వ్యాపారవేత్తలు, అవి ఆక్రమణలు అని తెలియక ఇల్లు నిర్మించుకున్నవారు చోటామోటా సామాన్యులు. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు ఇలా సామాన్యుడిని బాధితుడిగా ఎందుకు రోడ్డుమీదకు లాగుతుంది.? వారిని ఇటువంటి మానసిక క్షోభకు ఎందుకు గురి చేస్తుంది.?

రాజకీయ నాయకుల పేరుతో అధికార, విపక్ష పార్టీలలో ఎంతమంది నేతలు ప్రభుత్వ భూములను తమ భూములుగా మార్చుకున్నారు.? ఇంకెంతమంది చెరువులను ఆక్రమించుకుని విలాసవంతమైన భవనాల నిర్మాణాలు చేపట్టారు.? ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అనే బేధభావమేదీ ఉండదు.

ఎవరు అధికారంలో ఉన్నా వారి స్థాయిని బట్టి ఈ ఆక్రమణలు ఒక సీరియల్ మాదిరి కొనసాగుతూనే ఉంటాయి. కానీ అటువంటి ఆక్రమణల జోలికి ఏ ప్రభుత్వాలు కూడా వెళ్లే సాహసం చెయ్యలేవు, చెయ్యవు కూడా. ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడి ఆక్రమణలైన హైడ్రా టచ్ చెయ్యగలిగిందా.?

అధికారంలో ఉన్న కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతల భూ ఆక్రమణల పై, ఆ ఆక్రమణల స్థలంలో వారు నిర్మించుకున్న ఫామ్ హౌస్ లపై అనేక ఆరోపణలు చేసింది. కానీ వాటిలో ఏ ఒక్క నిర్మణానైనా ప్రభుత్వం కూల్చివేయగలిగిందా.? కానీ ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా బాధితులుగా మాత్రం సామాన్యులే ఉంటారు అనేది జగమెరిగిన సత్యమే.

అయినా ప్రజలు ప్రజానాయకులు అంటూ రాజకీయ నాయకులకు అధికారాన్ని కట్టబెడుతూనే ఉంటారు, వారి చేత మోసపోతూనే ఉంటారు. అయితే ప్రభుత్వాలు కూల్చే ఈ అక్రమ ఆక్రమణలను ఎవరు తప్పుబట్టారు, కానీ ఇందులో సామాన్యుడికి ఒక న్యాయం తమ రాజకీయ కులం వారికి మరో న్యాయం చూపించడమే ఇక్కడ వేలెత్తి చూపాల్సి వస్తుంది.

ADVERTISEMENT
Latest Stories