కేటీఆర్‌ ఇంకా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారా?

KTR

తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పుడు “రాజకీయాలలో గెలుపోటములు సహజం. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని, తప్పులు, లోపాలను సరిదిద్దుకొని మరింత బలంగా తిరిగి వస్తాము,” అంటూ ఓడిపోయిన పార్టీలన్నీ చెప్పే స్టాండర్డ్ డైలాగ్ చిలకల్లా పలికారు.

కానీ నేటికీ తమ ఓటమిని కేటీఆర్‌ జీర్ణించుకోలేకపోతున్నారని, ముఖ్యంగా ప్రజల తీర్పుని అంగీకరించలేకపోతున్నారని తాజా ట్వీట్‌తో మరోసారి నిరూపించుకొన్నారు.

ADVERTISEMENT

“ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత చాలా ఆసక్తికరమైన అభిప్రాయాలు, సూచనలు, విశ్లేషణలు వచ్చాయి. వాటిలో అత్యుత్తమైనది ఇదే… కేసీఆర్‌ 32 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసే బదులు, ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకొనేందుకు 32 యూట్యూబ్‌ చానల్స్ ఏర్పాటు చేసుకొని ఉంటే బాగుండేదేమో?”

నిజానికి గత పదేళ్లుగా కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు, వారికి వ్యక్తిపూజలు, వారి భజనలతో తెలంగాణ మార్మోగిపోతూనే ఉంది కదా? కేసీఆర్‌ పాలన గురించి గొప్పగా చెప్పుకొనే ప్రయత్నంలో అటు ప్రధాని నరేంద్రమోడీని ఇటు ఏపీ మంత్రులని, తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ నేతలని ఈసడించుకొని రోజు లేదు కదా?ఇంకా 32 యూట్యూబ్‌ చానల్స్ అవసరమనుకొంటే ఏర్పాటు చేసుకోవద్దని ఎవరన్నారు?

అయినా బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది?అని ఆలోచించాల్సిన కేటీఆర్‌, కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచింది?అని ఆలోచిస్తుండటమే ఆశ్చర్యం కలిగిస్తుంది.

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలలో ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి గెలిచిందని కానీ వాటిని అమలుచేయలేకనే రాష్ట్రం అప్పులలో మునిగిపోయిందని, దివాళా తీసిందని చెపుతూ అప్పుడే చేతులు ఎత్తేస్తోందని బిఆర్ఎస్ నేతలు రోజూ వాదిస్తూనే ఉన్నారు.

అయితే ఆ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఎటువంటి వ్యూహాలు అమలుచేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోలేదు కదా? అదే విదంగా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రావడం కోసం తన వ్యూహాలను అమలు చేసింది. కాంగ్రెస్‌ గెలిచిందంటే అర్దం వాటిలో బిఆర్ఎస్ వ్యూహాలు ఫలించలేదని కాంగ్రెస్‌ వ్యూహాలు ఫలించాయనే కదా?

బిఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం కేసీఆర్‌ అహంకారమే అనే ఫీడ్ బ్యాక్ కేటీఆర్‌కు వచ్చిందో లేదో తెలీదు కానీ నేటికీ కేటీఆర్‌లో ఆ అహంభావం కనిపిస్తూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా నెలరోజులు కూడా కాక ముందే కూలిపోతుందని అంటున్నారు.

తమది ప్రభుత్వాన్ని ఎవరూ వేలెత్తి చూపడానికి వెళ్ళేదన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూడా వేలెత్తి చూపకూడదు కదా? కాంగ్రెస్‌ది కూడా ప్రజలెన్నుకొన్న ప్రజా ప్రభుత్వమే కదా?మరి అది కూలిపోతుంది లేదా కూల్చేస్తాం అంటూ బిఆర్ఎస్ నేతలు మాట్లాడటాన్ని ఏమనుకోవాలి? ఇది ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న కుట్ర కాదా?

బిఆర్ఎస్ పార్టీ ఈవిదంగా వ్యవహరిస్తూ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, దాని గెలిపించిన ప్రజలను కూడా తప్పు పడుతుండటం, తాము గెలిస్తేనే ప్రజలు తీర్పు బాగుందని లేకుంటే బాగోలేదనడం సరికాదు కదా?

ADVERTISEMENT
Latest Stories