ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఎటువంటి పాలనానుభవం లేకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పదవి చేపట్టినవారే. ఒకరు వైసీపీ అంటూ సొంత పార్టీ సీఎంగా ఎదిగితే మరొకరు కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో యువ సీఎం గా అధిష్టానం ఆశీస్సులు పొందారు.
అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి గా జగన్ రెడ్డి వందల కొద్ది ప్రభుత్వ సలహాదారులను నియమించుకుని పాలన చేసారు, అలాగే వేలకొద్ది పార్టీ క్యాడర్ ని వాలంటీర్లుగా ఎంపిక చేసుకుని ప్రభుత్వాన్ని నడిపారు. సాక్షి అంటూ వార్త పత్రిక, న్యూస్ ఛానెల్ సాయంతో వైసీపీ రాజకీయం నడిపారు.
ప్రజావేదిక కూల్చివేతలో ముఖ్యమంత్రిగా తొలి అడుగు వేసిన జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర రాజధాని అమరావతి కూల్చివేతతో ముందుకు సాగారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బటన్ నొక్కడమే పాలన అంటూ నమ్మిన జగన్ పరదాల చాటున ప్రజల మధ్యకు వచ్చారు.
కక్ష్య రాజకీయాలకు తెరలేపుతూ, పాదయాత్రతో వచ్చిన ఒక ఛాన్స్ ని పరదాలకి పరిమితం చేసారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలే దేవుళ్ళు అంటూ వారికీ ముద్దులు పెట్టి, హగ్గులు ఇచ్చి నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ రోడ్ల మీద నడిచిన జగన్, అధికారం చేతికి అందగానే కనీసం సొంత పార్టీ నేతలు, మంత్రులకు కూడా సమయం కేటాయించకుండా ప్రభుత్వం అంటే ప్రజల మధ్య పాలన కాదని ప్యాలస్ రాజకీయాలు అంటూ రోడ్లు వదిలి గాలిలో తిరిగారు.
ఇక రేవంత్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం ప్రభుత్వంతో పోరాటాలు, ప్రజాక్షేత్రంలో సావాసాలు అన్నట్టుగా ముందుకెళ్లారు. రేవంత్ రాజకీయ ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది, అణిచివేతలకు గురయ్యింది, సొంత పార్టీలోనే ఆధిపత్య రాజకీయాలతో అల్లాడింది.
బిఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా, కేసీఆర్ పతనమే ఆశయంగా, వారిని గద్దె దింపడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీలో ఒంటరి పోరు సాగించి చివరికి అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నారు రేవంత్. అయితే వచ్చిన ఆ అవకాశాన్ని తిరిగి ప్రజలకే కేటాయిస్తూ, నిత్యం ఎదో ఒక కార్యక్రమం తో ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు.
రేవంత్ రాజకీయ గురువు చంద్రబాబు అనే ప్రత్యర్థి పార్టీ నేతల విమర్శలకు తగ్గట్టే బాబు మాదిరే రేవంత్ కూడా నిత్యం ప్రజల మధ్యే గడుపుతున్నారు. అధికారం అందగానే ఉద్యమ నాయకుడిగా ఎదిగిన కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమైతే, ఒక్కఛాన్స్ తో ముఖ్యమంత్రి పదవి దక్కగానే మాస్ లీడర్ అనిపించుకున్న జగన్ ప్యాలస్ గడప దాటకుండా పాలన చేసారు.
కానీ రేవంత్ మాత్రం తనకు దక్కిన ఈ అవకాశాన్ని కక్ష్య రాజకీయాల కోసమో, రాజరిక సౌకర్యల కోసమో వృధా చేయకుండా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా పోరాటాలు చేసారు, అధికారంలోకి వచ్చాక కూడా ప్రజల మధ్యే ఉంటూ ప్రజా పాలన చేస్తున్నారు.
ఇటు సభలు సమావేశాలతో ప్రజలను కలుస్తున్నారు, అటు పార్టీ కార్యక్రమాలతో మంత్రులు, సొంత పార్టీ నేతలతో టచ్ లో ఉంటున్నారు, అలాగే ఎప్పటికప్పుడు ప్రతిపక్ష బిఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతూ పార్టీ క్యాడర్ లో నేనున్నాను అనే భరోసా నింపుతున్నారు.
అలాగే జగన్ మాదిరి రేవంత్ ప్రభుత్వంలో వందలమంది సలహాదారులు లేరు, వేలమంది వాలంటీర్లు లేరు, నిత్యం తన భజన చేసే వార్త పత్రికలు కానీ, న్యూస్ ఛానెల్స్ కానీ లేవు, అయినా రేవంత్ వేసే ప్రతి అడుగు ప్రజలకు తెలుస్తుంది, ఆయన చేస్తున్న ప్రతి ప్రకటన గ్రౌండ్ స్థాయి నాయకత్వం వరకు చేరుతుంది.
ఇలా రేవంత్ జూనియర్ ముఖ్యమంత్రిగా తొలి అడుగువేసినప్పటికీ సీనియర్ సీఎం లకు ధీటుగా ముందుకెళ్తున్నారు. రాటుతేలుతున్నారు. కానీ జగన్ మాత్రం తన అనుభవరాహిత్యాన్ని ఇప్పటికి అలానే కొనసాగిస్తూ నేను పట్టిన కుందేలుకి ముందే కాళ్ళు అనేలా మొండిగా, మోనార్క్ మాదిరి ముందుకెళ్తున్నారు.






