ఇరాన్ – అమెరికా యుద్ధం తాలూకా ఫలితాలు ఆంధ్రప్రదేశ్ వాహనదారులను తాకాయి. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అన్ని జిల్లాలో పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల కొద్దీ వాహనాలు క్యూలు కడుతున్నాయి. దీనితో కొన్ని ప్రదేశాలలో ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదురవుతున్నాయి.
అయితే ఉన్నట్టుండి ఏపీలో ఈ స్థాయిలో ఇంధన కొరత ఏర్పడడం పట్ల ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. అసలు ఈ ఇంధన కొరత కృత్రిమంగా సృష్టించబడిందా.? లేదా వాహనదారులలో వచ్చిన పానిక్ తో ఏర్పడిందా.? బెంగాల్ ఎన్నికల తరువాత పెట్రోల్ రేట్లు భారీ స్థాయిలో పెరగవచ్చు అనే వార్తలతో వాహనదారులు అవసరానికి మించి వాహనాలలో పెట్రోల్ ని నింపడం ఒక కారణంగా కనపడుతుంటే,
మరోపక్క పెట్రోల్ బంకు యజమానులే ఈ కృత్రిమ కొరత సృష్టించి వాహనదారులను బయాందోళనలోకి తీసుకెళ్తున్నారు అనే వాదన కూడా నడుస్తుంది. అయితే క్షేత్ర స్థాయిలో సమస్య తీవ్ర రూపంలో కనిపిస్తుంది. ఇక పరిస్థితి మరి చెయ్యి దాటకుండానే మేలుకున్న ప్రభుత్వం తక్షణ చర్యలకు అధికారులకు ఆదేశాలు అందచేసింది.
సీఎం బాబు ఈ ఇంధన కొరత మీద సమీక్ష జరిపి సమస్య ఈ స్థాయికి వచ్చేవరకు ఎందుకు జాప్యం చేసారంటూ అటు అధికారులను ఇటు చమురు కంపెనీలను ప్రశ్నించారు. సమస్య పరిష్కారానికి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని, బంకులలో నో స్టాక్ బోర్డులు కనిపించడానికి వీలులేదంటూ ఆదేశించారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం ట్యాంకర్లతో, బారి క్యాన్లతో వచ్చి పెట్రోల్ కొనుగోలు చేసేవారి బంకు సిబ్బంది పెట్రోల్, డీజిల్ ని విక్రయించవద్దని ఆదేశించారు. అలాగే అధికారులు సైతం బంకులలో సోదాలు జరిపి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి వాహనదారులకు ఇబ్బందులు రాకుండా చూసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కలెక్టర్లు, జేసి, ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఇంధన నిల్వలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ బెంజిసర్కిల్, తాడేపల్లి, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి…ఇలా ప్రతి ప్రాంతంలోనూ ఈ పెట్రోల్, డీజిల్ కష్టాలు వాహనదారులను ఆందోళనలోకి నెడుతున్నాయి.
వేసవి ఎండలు తీవ్రంగా ఉండడంతో రోడ్ల మీద కార్ల వాడకం ఎక్కువయ్యింది. దీనితో సమస్య మరికాస్త తీవ్రంగా మారింది. ఇక CNG కష్టాలతో ఆటోవాలాలు సైతం బంకుల ముందు క్యూలు కడుతూనే ఉన్నారు. దీనితో తెలంగాణ సరిహద్దు ప్రాంతాల ప్రజలు తమ టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలకు సరిపడ పెట్రోల్, డీజిల్ కోసం తెలంగాణ బంకుల ముందు క్యూలు కడుతున్నారు.
దీనితో ఏపీ సరిహద్దు ప్రాంతాలలో ఉండే తెలంగాణ పెట్రోల్ బంకులలో సైతం నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, గద్వాల్, వనపర్తి, కొట్తగూడెం వంటి జిలాల్లో పెట్రోల్ నిల్వలు అయిపోయాయంటూ బోర్డులు పెట్టి బ్లాక్ లో అధిక రేట్లకు పెట్రోల్ అమ్మకాలకు తెరలేపారు.







