ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జోరుగా వినిపిస్తున్న పాట మావిగన్. ఈ క్రెడిట్ పూర్తిగా జగన్కే సొంతం. సిఎం చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినా దాని క్రెడిట్ కొట్టేయలేరు. కనుక అయన మళ్ళీ మాట తప్పకుండా, మడమ తిప్పకుండా వచ్చే ఎన్నికల వరకు తన టీమ్తో కలిసి మావిగన్ పాట పాడుతూనే ఉండాలని మాత్రం చంద్రబాబు నాయుడు కోరుకోవచ్చు.
యువకుడు మరో ముప్పై ఏళ్ళు రాజకీయాలలో, ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చిత్రవిచిత్రమైన పదాలు, రాజధానులు కనిపెడుతుంటే, 74 ఏళ్ళ వయసులో కూడా సిఎం చంద్రబాబు నాయుడు కాలేజీ కుర్రాడిలా క్వాంటం కంప్యూటర్ గురించి కొత్త విషయాలు నేర్చుకుంటూ, దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్వాంటం వ్యాలీ, దానిలో క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థని ఏర్పాటు చేయిస్తున్నారు.
నిజానికి చాలామంది యువతకు, ఇంజనీరింగ్ విద్యార్ధులకు కూడా ఈ క్వాంటం కంప్యూటింగ్ గురించి పెద్దగా తెలీదు. సామాన్య ప్రజలు ఇప్పుడిప్పుడే ఏఐ గురించి తెలుసుకొని అలవాటుపడుతున్నారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు మన అందరి కంటే చాలా ముందున్నారని మరోసారి నిరూపించుకున్నారు.
నేడు అమరావతిలో ఎస్ఆర్ఎం వర్సిటీ, గన్నవరం మేధా టవర్స్లో ‘క్వాంటం టెస్ట్ బెడ్స్’ ప్రారంభోత్సవం చేశారు. వాటిలో 1ఎస్, 1 క్యూ క్వాంటం టెస్ట్ బెడ్స్ ఉన్నాయి. దేశంతోనే టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, రాజధాని అమరావతి నిలిచిందంటే వాటిపై సిఎం చంద్రబాబు నాయుడుకి ఉన్న ఆసక్తి, అవగాహన, దూరదృష్టి, పట్టుదల వల్లనే అని వేరే చెప్పక్కరలేదు.
జగన్ మావిగన్ అంటుంటే, సిఎం చంద్రబాబు నాయుడు క్వాంటం కంప్యూటర్, టెస్ట్ బెడ్స్ అంటున్నారు. పార్లమెంటులో, ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ‘మావిగన్’ అంటూ అందరూ నవ్వుకుంటున్న వారే, అమరావతిలో క్వాంటం టెస్ట్ బెడ్స్ ప్రారంభోత్సవం గురించి చెప్పుకొని అబ్బురపడుతున్నారు.
అంతేకాదు… జగన్ తాడేపల్లి ప్యాలస్లో కూర్చొని మావిగన్ వంటి కొత్త కుట్రలు రచిస్తున్న సమయంలోనే, ప్రముఖ జాతీయ పత్రిక ఎకనామిక్ టైమ్స్ సిఎం చంద్రబాబు నాయుడుని ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సన్మానించబోతోంది.
ఈ నెల 25న ముంబాయిలో జరిగే ఈ కార్యక్రమంలో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్, పలువురు కార్పోరేట్ కంపెనీ దిగ్గజాలు హాజరవుతున్నారు.
మరో విశేషమేమిటంటే ఈ కార్పోరేట్ ఎక్స్లెన్స్ అవార్డుల కార్యక్రమానికి సిఎం చంద్రబాబు నాయుడును గౌరవ అతిధిగా ఆహ్వానం అందుకున్నారు.
ఈ వయసులో కూడా సిఎం చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో గౌరవ మర్యాదలు అందుకుంటుంటే, వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఏమిటి? ఆయన ఎవరెవరితో సమావేశమవుతున్నారు? ఏం మాట్లాడుతుంటారు? అంటే సమాధానాలు అందరికీ తెలుసు.




