ప్రో.నాగేశ్వర్, జనసేనాని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ తర్వాత తెలంగాణలో జరిగిన రాద్దాంతం చూసినప్పుడు కొన్ని సందేహాలు కలుగుతాయి.
టీడీపి, జనసేన ఆంధ్రా పార్టీలు. కనుక వాటికి తెలంగాణలో అనుమతి, అవసరం రెండూ లేవని పలువురు ఆవేశంగా వాదించారు.
ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఎవరికీ ఎవరి అనుమతి అవసరం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. దానిని వాళ్ళూ అంగీకరిస్తూనే ‘ఇక్కడెందుకు? అంటూ మళ్ళీ అదే పాట పాడారు.
‘తెలంగాణ మా అడ్డా’ అని సగర్వంగా చెప్పుకుంటున్నప్పుడు టీడీపి లేదా జనసేన తెలంగాణలో పోటీ చేస్తే భయం, ఆందోళన, అభ్యంతరాలు దేనికి? ఆ రెండు పార్టీలను ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడించి వాటికి తెలంగాణలో స్థానం లేదని నిరూపిస్తే సరిపోతుంది కదా?
2023 శాసనసభ ఎన్నికలలో జనసేన పోటీ చేసిన 8 చోట్ల ఓడిపోతే ఎవరు నష్టపోయారు? ఆ పార్టీ… దాని నేతలే కదా?
చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా తెలంగాణ రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. వారిలో చంద్రబాబు నాయుడు తెలంగాణలో హెరిటేజ్ సంస్థ ద్వారా అక్కడ అనేక వేలమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నారు. ఆ సంస్థ ఆదాయ, వ్యయాలపై తెలంగాణ ప్రభుత్వానికి భారీగా పన్ను రూపంలో ఆదాయం సమకూరుతోంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు చంద్రబాబు నాయుడుని ద్వేషిస్తారు. జగన్ని ప్రేమిస్తుంటారు!
తెలంగాణపై టీడీపి పెత్తనం చలాయిస్తుందనే ఊహాజనితమైన వాదనలతో దానిని వ్యతిరేకిస్తుంటారు వాస్తవం ఏమిటంటే 2023 శాసనసభ ఎన్నికలలో టీడీపి పోటీ చేయలేదు. కానీ అప్పుడూ బీఆర్ఎస్ పార్టీని ఓడించి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికే పోటీ చేయలేదనే వాదనలు వినిపించాయి. అంటే టీడీపి, జనసేనలు తెలంగాణలో పోటీ చేసినా, చేయకపోయినా అభ్యంతరమే అన్నమాట!
ఆంధ్రా నేతలతో వ్యక్తిగత సంబంధాలు బాగుంటే అంతా ఓకె! లేకుంటే వారు తెలంగాణ శత్రువులే… దీనిని ఏ వాదం అనాలి?




